నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు.... పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. ఇవే కాకుండా మనం భూమిని భూమాతగా కొలుస్తూఉంటాం మరి ఈ భూమి మనుషులకు ఇచ్చే అద్భుతమైన వరం వ్యవసాయం. ఇది మన మనుగడకు జీవనాధారం. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తూన్న ఆచారం.అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే "ఏరువాక పౌర్ణమి".
ఏరువాక పౌర్ణమి పండుగ ఏ విధంగా జరుపుకుంటారు:-
ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ పండుగను రైతన్నలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. అవి లేకుండా ఏ పని జరుగదు. అందుకే ఎద్దులను దైవంగా భావించి పూజిస్తారు. ఆ రోజు ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు అందమైన రంగులు పూసి, మెడలో కొత్త గంటలు, రంగుల పూసలు, పూలతో నిండిన దిష్టి తాళ్ళు కట్టి అలంకరిస్తారు. వాటి కాళ్ళకు ఘల్లు-ఘల్లు మనే గజ్జెలు కడతారు. నాగలిని - కాడికి కూడా రంగులు పూస్తారు. పశువులను కట్టె స్థలాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేసి, ధూపదీపనైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా పొంగలి వండి ఎద్దులకు తినిపిస్తారు. ఆ రోజు సాయంత్రం రైతులు నాగలిని భుజం మీద పెట్టుకుని ఎద్దులను తోలుకొని పొలాల వద్దకు వెళ్ళి అక్కడ భూమిని పూజించడం, దున్నడం ప్రారంభిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తప్పెట్లతో, మేళతాళాలతో ఎద్దుల్ని ఊరేగిస్తూ రైతులు పొలానికి చేరుకుంటారు.

అక్కడ గోగునారతో చేసిన తోరణాన్ని పొడవుగా కడతారు. ఆ తోరణాన్ని ఆ ఊళ్ళో ఉన్న కర్ణకులందరూ చర్నాకోలతో క్టొటి పీచుపీచుగా చేస్తారు. ఆ పీచును ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకుపోయి ఎద్దుల మెడలకీ, నాగళ్ళకి కడతారు. కొన్ని ఇళ్ళల్లో వీటిని భక్తిగా దాచుకుంటారు.
ఆ విధంగా చేస్తే తమ పశువులకు మంచి జరుగుతుందని నమ్ముతారు. తరువాత తమ కుటుంబ సభ్యులతో కలిసి పిండివంటలతో విందు భోజనాన్ని ఆనందంగా ఆరగిస్తారు కర్షకులు. ఈ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు, తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు.

చల్లిన ప్రతిగింజా కోటిమొక్కలై వర్ధిల్లాలని....
పాడిపంటలతో తమ ముంగిళ్ళు మురిసిపోవాలని....
అందరూ చల్లగా ఉండాలని....
నిండు మనస్సుతో ఏరువాకమ్మని కోరుకుంటారు. దుక్కిన భూమి, దిక్కున మనిషి ఎన్నటికీ చెడడు అని కర్షకులు గట్టిగా నమ్మతారు. ఆ రోజు ఎంత అవసరమొచ్చినా ఎవరికి అప్పు ఇవ్వరు. వర్షాకాల ప్రారంభ సమయంలో వ్యవసాయ ప్రారంభానికి ముందు భూమి పూజ, ఎడ్ల పూజచేసి నాగలితోపాటు మొదిగా భూమిని దున్నే పండుగను కర్షకులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
జానపదుల మనసుల్లో ఏరువాక పౌర్ణమి :-
నిత్యపరిశీలన వల్ల జానపదులకు జ్యోతిష సంబంధమైన విజ్ఞానం అవగాహన అధికంగా ఏర్పడింది. జానపద సాహిత్యంలోనూ జానపద విజ్ఞానంలోనూ జ్యోతిశాస్త్రానికి సంబంధించిన ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయానికి చెందిన జానపదుడు కార్తెలకు సంబంధించిన విజ్ఞానంతో అనుకూలమైన సమయం కోసం ఎదురు చూసేవారు. దానికి అనుగుణంగానే ఏ సమయంలో ఏ పంటలు వేస్తే, ఏ కాలంలో బాగా పండుతాయో ఆ సమయంలో విత్తనాలు జల్లి పొలం పనులు ప్రారంభిస్తారు. పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురవాలని సిరిధాన్యాలతో ఇల్లు నిండాలని ఈ నేల సస్యశ్యామలం కావాలని కోరుకుంటారు.
దేశవాసుల పండుగ:-
మన దేశమంతా వర్షాలు ఒకేసారి పడటం ద్వారా ఏరువాక పౌర్ణమి పండుగను వివిధ విధాలుగా దేశమంతా జరుపుకుంటారు. ఏరువాక పూర్ణిమను "సీతాయజ్ఞం" అని సంస్కృతంలో "ఉద్వృషభ యజ్ఞం "అని కన్నడంలో "కారణి పబ్సము "అని వివిధ పేర్లతో పిలుస్తారు. వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా జరుపుకుంటున్నారు. అధర్వణవేదంలో ఏరువాకను అనడుత్సవంగా చెప్పబడింది. క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు.
పురాణాలలోను ఏరువాక పౌర్ణమి ప్రస్తావన:-
ఏరువాక పండుగ అతి ప్రాచీనమైంది. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా జరుపుకుంటున్నారు. అధర్వ
ణవేదంలో ఏరువాకను అనడుత్సవంగా చెప్పబడింది. క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు.
విష్ణుపురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించారు. సీత అంటే నాగలి అని అర్థం. ''వప్ప మంగళ దివసం..'' బీజవాపన మంగళ దివసం...'' ''వాహణ పుణ్ణాహ మంగళమ్...'' ''కర్షణ పుణ్యాహ మంగళమ్...'' అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు. శుద్ధోదనమహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఐతిహ్యం. గాథాసప్తశతిలో ఏరువాకను గురించిన గాథలున్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్యధారాలున్న 2000 సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఇది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్టు తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏరువాక గురించి ఎంతో వుంది .....
అందుచేత ఏరువాక పౌర్ణమి అయిన ఈ రోజున రైతన్నలకు ధాన్యపు సిరులు కురవాలని ఆశిద్దాం...!

Comentarios